Friday, April 17, 2020

రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ

రాగం:శివరంజని

స్ఫురించినంతనే రామా నీ రూపం
దివ్య సుందర విగ్రహం
స్మరించినంతనే రామా నీ నామం
మకరంద మాధురీ సమం
అమృత తుల్యం నీ అద్భుత చరితం
అనన్య సామాన్యం ఆదర్శ భరితం

1.తరించింది తాటకి నీ బాణం తాకి
అవతరించింది నాతి నీ పాదం సోకి
వరించింది జానకి విలువిరిచిన నీ శౌర్యానికి
కలవరించింది సాకేతపురి నీ పట్టాభిషేకానికి

2.విలువ హెచ్చింది నీ వల్ల రాజసానికి
జనం మెచ్చింది నువుపాటించ తండ్రిమాటకి
కళవచ్చింది పదునాలుగేళ్ళు దట్టమైన వనికి
కీర్తి తెచ్చింది నీ ధర్మనిరతి భారతావనికి

3.భక్తి కుదిరింది నదిదాటగ బోయవాడికి
బ్రతుకు ఆరింది నిన్నేమార్చ మాయలేడికి
మైత్రి కలిసింది నీకూ కిష్కింద వానరుడికి
ముక్తిదొరికింది రావణుడికి నీ తూపువాడికి