Friday, March 20, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హేమవతి

ఏడు కొండలనే వీడినావులే సరి
మా గుండెల చేరరావో శ్రీహరి
విజృంభిస్తున్నదీ కరోనా మహమ్మారి
మము కావగ నినువినా ఎవరుమరి
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

1.మా దేహమందు నిన్ను ఆవాహన చేసెదము
మా హృదయమందు నీకు ఆసనము వేసెదము
పన్నీటి పాద్యమిచ్చి పదముల కడిగెదము
కన్నీటి అర్ఘ్యమొసగి కరముల తోమెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

2.మాలిన్యము తొలగేలా అభిషేకించెదము
స్వచ్ఛమైన వస్త్రాలను ధరియించెదము
ప్రకృతి పచ్చదనం నిత్యం నిలిపెదము
పర్యావరణమునే పరిశుభ్ర పరిచెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

3.సాటివారిపట్ల మేము బాధ్యతగా మెలిగెదము
కలుషితాలనెడబాసి నీ ధ్యాసలొ మనెదము
ప్రతి నరుడిలో మురహరినే దర్శించెదము
మానవీయ బంధాలు పునరుద్ధరింపజేసెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

No comments: