Thursday, November 7, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శుభ పంతువరాళి

నిద్రలేని రాత్రులెన్నో నీకోసం ధారపోసా
నా మనః సాగరాన్ని ఎంతగానొ మథనం చేసా
కవనామృతభాండం కోసం అనవరతం పరితపించా
ఎంత సుధను పంచానో మోహినికే ఎరుక
నిర్లక్ష్యపు గరళాన్ని దిగమ్రింగుతు నే బ్రతికా

భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

1.కదిలించిన ప్రతివస్తువును కవితగా రాసేసా
భిన్నమైన అభిమానులకై పలువిధముల రచనలు చేసా
రంజింప జేయడమే లక్ష్యంగా నే తలపోసా
మానవతే పరమావధిగా గీతాలను నే కృతిచేసా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

2.సుందరమౌ చిత్రాలుగా నా పాటలనే మలిచా
శబ్దార్థ కౌశేయములతొ అలంకరింప జేసా
ప్రాసల పసిడి నగలతో నిన్ను తీరిచి దిద్దా
అక్షరమే దైవంగా అను నిత్యం నే కొలిచా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

No comments: