Tuesday, April 7, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నను స్పృశియించుమన్న వస్తువే లేదాయే
నను సృజియించమన్న ఆత్మే కనరాదాయే
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

1.రాసాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు
నుతించె స్తోత్రాలు జగద్గురు శంకరాచార్యులు
త్యాగయ్యా అన్నమయ్య కృతులెన్నొ కూర్చారు
క్షేత్రయ్యా జయదేవులు రక్తినొలికించారు
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

2.మేఘాల కావ్యాల బంధించె కాళిదాసు
మనుచరిత్ర వచించె అల్లసాని పెద్దన
విజయవిలామొనరించె చేమకూర కవి
కరుణారసమొలికించె తెనాలి వికటకవి
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

3.ప్రకృతినంత పదముల నుడివె కృష్ణ శాస్త్రి
అభ్యుదయము నెత్తుకునే అలనాడే శ్రీశ్రీ
మనసును మధించాడు ఆచార్య ఆత్రేయ
అక్షర కన్నెల వెన్నెలనాడించినాడె తిలక్
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

No comments: